గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని 32 వార్డుల్లో కరోనా పాజిటీవ్ కేసులు అధిక సంఖ్య లో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ పట్టణంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 1,136 కు చేరింది. 324 యాక్టివ్ కేసులు కాగా 795 మంది కోవిడ్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు తెలిపారు.
కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 17 కు చేరినట్లు తెలిపారు. ప్రతీ రోజు నమోదయ్యే పాజిటీవ్ కేసుల సంఖ్య గతంతో పోల్చితే కొంత తగ్గు ముఖం పట్టిందని కోవిడ్-19 వైద్యులు వెంకట్రావ్ తెలిపారు. ఇక కంటైన్మెంట్ జోన్లలో భారీ కేడ్లు ఏర్పాటు ను అధికారులు మినహాయించారు.
32 వార్డుల్లో ఏ వార్డులో ఏ రోజు ఎన్ని పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి? అన్న ప్రశ్న కు మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమాధానం ఇవ్వకుండా గోప్యత పాటిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
మండలంలో గ్రామాల వారీగా సమాచారం వెల్లడిస్తున్నా,మిగిలిన మున్సిపాలిటీ ల్లో వార్డుల సమాచారం ప్రకటిస్తున్నా,మంగళగిరి మున్సిపాలిటీలో పరిస్థితి దీనికి భిన్నంగా మారింది. వార్డుల సమాచారం అడిగిన విలేఖరులకు ప్రతీ సారి చేదు అనుభవమే ఎదురవుతోంది.
వార్డుల సమాచారం అడిగితే అసహనం వ్యక్తం చేస్తూ,పొంతన లేకుండా సచివాలయాల సమాచారం వెల్లడించడం అయోమయానికి గురి చేస్తోంది. ఒక్కో సచివాలయంలో రెండు వార్డుల చొప్పున అనుసంధానం చేయటం తో సమస్యగా మారింది.