కరోనాను కట్టడి చేయలేని నిస్సహాయ స్థితిలోకి దేశం వెళ్లి పోతున్నదా? రోజు రోజుకూ పెరుగుతున్న పాజిటీవ్ కేసులను పరిశీలిస్తే ఇదే విషయం ఖరారు చేసుకోవాల్సి వస్తున్నది. రోజుకు సగటున 6 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, నేడు కేసుల సంఖ్య 1.50 లక్షలను దాటింది.
మంగళవారం సాయంత్రానికి అధికారికంగా 1.46 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా ఈ ఉదయం విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం కేసుల సంఖ్య 1.51,767కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 83004 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 4,337 మంది మరణించారని, 64,426 మంది చికిత్స తరువాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వలస కార్మికుల తరలింపుతో కరోనా వైరస్ పట్టణాల నుంచి గ్రామాలకు విస్తరించిందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న విధానాన్ని చూస్తే, జూలై నెలాఖరుకి కేసుల సంఖ్య 10 లక్షలకు చేరే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. సామూహిక వ్యాప్తి అంటే నాలుగో దశ ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ప్రారంభమైనట్టుగానే భావించవచ్చని సీసీఎంబీ వైరాలజీ నిపుణులు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ప్రతి పది లక్షల మందిలో 1,744 కరోనా టెస్టులు మాత్రమే జరుగుతున్నాయని, టెస్టుల సంఖ్యను పెంచితే, రోగుల సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. గ్రామాలలో విస్తరణ ప్రారంభమైతే ప్రస్తుతం వందల సంఖ్యలో ఉన్న కేసులు వేలల్లోకి చేరిపోతుంది.