ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)బిచ్కుంద శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్థం అయిందని అన్నారు.
ఆన్లైన్ క్లాసుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారన్నారు. లాక్ డౌన్ ప్రారంభ సమయంలో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రగల్భాలు పలికి ఇప్పుడు విద్యా వ్యవస్థలను పట్టించుకోవడం లేదని వారు తెలిపారు.
విద్యా వ్యవస్థను విస్మరిస్తారా
ఎంతో కీలకమైన విద్యా వ్యవస్థను విస్మరించడం బాధాకరమని అన్నారు. స్కూల్ ఫీజులు పెంచవద్దు, కరోన కష్ట కాలంలో ఫీజులు అడగవద్దు అని చెప్పి ఆ విషయాన్ని ఇప్పటివరకూ లేవనెత్తక పోవడం సిగ్గుచేటని అన్నారు. ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఫీజులు కట్టలేక, ఆన్లైన్ విద్య కోసం స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్, ట్యప్ లు కొనలేక ఇంకోవైపు ఇంటర్నెట్ డేటా కోసం వేలాది రూపాయలు కట్టలేని పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు మానసిక వేదనకు గురవుతున్నారు.
అదేవిధంగా చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించటం కారణంగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఆన్లైన్ క్లాసులు, పాఠశాల ఫీజులు, విద్యా సంవత్సరం ప్రారంభం తదితర ఈ విషయాల పైన విధి విధానాలను రూపొందించి విద్యార్థులకు తల్లిదండ్రులకు మార్గదర్శకాలను తెలియజేయాలని ఏబివీపీ డిమాండ్ చేస్తుంది.
ఆన్ లైన్ క్లాసుల పేరుతో దోపిడి
అదే విధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకున్న కూడా ఆన్లైన్ క్లాస్ ల పేరుతో అడ్మిషన్ తీసుకుంటున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు కరోనా కష్టకాలం వలన ప్రైవేటు పాఠశాలల యాజమన్యాలు జీతాలు ఇవ్వక పోవడం కారణంగా వారి బతుకులు రోడ్డుపైన పడ్డాయి. ప్రైవేట్ ఉపాధ్యాయులకు వెంటనే ఆయా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో జీతాలు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ హెచ్చరిస్తుంది.