పరిపాలన లో న్యాయస్థానాల జోక్యం తగదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆ కేసులను వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లు వస్తున్నారు. ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ జోక్యం చేసుకుంటే ఇబ్బందులేనన్నారు.
మేము ఏమీ కోర్టుల జోలికెళ్లడం లేదన్నారు. అయితే కోర్టుల్లో జరుగుతూన్న పరిణామాల విషయంలో మాత్రం బాధేస్తోంది. ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల విషయంలో కోర్టు తీర్పుతో కొంత బాధపడిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే కొంచెం జాప్యం అవుతుంది. సుప్రీంకోర్టుకు వెళ్లి వెసులుబాటు పొందే ప్రయత్నం చేస్తామన్నారు.
పంచాయతీ భవనాలకు ఏడు రంగుల్లో ఏదో రంగు వేయాలి.. దీని పైనా కోర్టులకు వెళ్తామని సజ్జల అన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహాణకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన నిమ్మగడ్డ.. వాయిదా వేసేటప్పుడు ఎందుకు సంప్రదించ లేదన్నారు.
నిమ్మగడ్డ రాసిన లేఖలో సీఎం జగన్ ను ఫ్యాక్షనిస్టు అన్నట్టుగా ఎందుకు రాయాల్సి వచ్చింది..? చెప్పాలన్నారు. ఆయన నిష్పాక్షికంగా లేరు.. ఒక వైపు టరన్న్ తీసుకున్నట్టు స్పష్టంగా కన్పిస్తోంది. అడ్వకేట్ జనరల్ (ఏజీ) మాట్లాడితే నిమ్మగడ్డ కంటే ముందుగా యనమల స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది..? అని ప్రశ్నించారు.
ఒక డాక్టర్ రోడ్డు మీద తాగి ప్రభుత్వాధినేతను తిడుతోంటే కొందరు కోర్టులో కేసులు వేస్తారని ఆవేదన వ్యక్తంచేశారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా రూ.2 వేల కోట్లు ఆదా చేశాం.. ఇది కన్నా లక్ష్మీనారాయణకు కన్పించదా..? అని ఆయననిలదీశారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీశాం.. దోషులను బయటపెడతామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దోషులను బయటపెట్టడం కొంచెం ఆలస్యం అవుతుందన్నారు. సౌదీ ఆరేబియా లాంటి దేశాల్లో చేసినట్టు చేయలేం కదా..? అన్నారు.
ప్రభుత్వం సాంకేతికంగా.. న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొటుంటే.. ప్రభుత్వం తప్పులు చేస్తోందని విషతుల్యం చేసేలా టీడీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ఏడాది కాలంలో ప్రతి నిత్యం ప్రభుత్వంపై ఎదురు దాడి చేసే పరిస్థితి ఉందన్నారు.
టీడీపీ హయాంలో కెబినెట్ సమావేశాలన్నీ టెండర్లు ఖరారు చేయడం.. బ్యాంకు గ్యారెంటీలకే సరిపోయిందన్నారు. అధికారాన్ని కేంద్రీకృతం చేయాలని అంతా భావిస్తోంటే.. జగన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏడాది పాలనలో జగన్ సృష్టించిన రికార్డులను మరుగున పర్చేందుకే చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. కోర్టుల్లో పడుతూన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఏయే అంశాల్లో వేస్తున్నారో చూస్తే పరిస్థితేంటో అర్ధం అవుతోందని ఆయన అన్నారు.