తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు గురువారం రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలో పెద్దశేష వాహన సేవ జరిగింది.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) పరమపదనాథుని అలంకారంలో అనుగ్రహించారు. అనంతశ్చ అస్మి నాగానాం… సర్పానాం అస్మి వాసుకిః… తాను నాగులలో శేషుడిని, సర్పాలలో వాసుకిని అని సాక్షాత్తు పరమాత్మ చెప్పినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఆదిశేషుడు తన శిరస్సుపై సమస్త భూభారాన్ని మోస్తుంటారు. ఆదిశేషుడు శ్రీహరికి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. స్వామివారికి పానుపుగా, దిండుగా, పాదుకలుగా, ఛత్రంగా, వాహనంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుడిని దర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ జవహర్రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు ప్రశాంతి రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.