జిల్లాల్లో వేళ్లూనుకుని ఉన్న సమాచార శాఖ యంత్రాంగాన్ని కుదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ విజయాలను ప్రజలకు అనునిత్యం తెలియచేసేందుకు సమాచార శాఖ క్షేత్ర స్థాయి కార్యాలయాలు పని చేస్తుంటాయి.
ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రచారం చేయడంలో సమాచార శాఖ డివిజనల్ కార్యాలయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే చాలా కాలంగా రిక్రూట్ మెంట్లు లేకపోవడంతో చాలా చోట్ల డివిజనల్ పిఆర్ వో కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నాయి.
కొత్త పోస్టులు సృష్టించడం అటుంచి ఉన్న వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో డివిజనల్ పి ఆర్ వో కార్యాలయాలు కొద్ది మేరకు మాత్రమే పని చేయగలుగుతున్నాయి. ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఉండే ఈ డిపిఆర్వో కార్యాలయాలు ఇక అనవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కొందరు చెబుతున్నారు.
రెవెన్యూ డివిజన్ లలో అద్దె భవనాలలో ఉండే డిపిఆర్వో కార్యాలయాలను తీసేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అయింది. అలా ఖాళీ చేసిన భవనాలలో పని చేసే సిబ్బందిని వేరే డివిజన్ లకు పంపుతారు. లేదా జిల్లా కార్యాలయాలకు తరలిస్తారు.
ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయితే రాష్ట్రంలో సమాచార శాఖ నామమాత్రంగా మారిపోతుంది. దాదాపుగా అంతరించిపోతుందని చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అధికార పార్టీ శాసన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది.