కరోన లాక్ డౌన్ నేపధ్యంలో కష్టాలెదుర్కోoటున్న ప్రజల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కడప జిల్లా కార్యాలయం ఎద్దుల ఈశ్వర్ రెడ్డి హాలు లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య,కార్యవర్గ సభ్యులు క్రిష్ణ మూర్తి,నాగసుబ్బారెడ్డి, నగర కార్యదర్శి వెంకట శివ, నగర కార్యవర్గ సభ్యులు కేసి బాదుల్ల, భాగ్యలక్ష్మి, దస్తగిరి, వలరాజ్,పవన్ తదితరులు దీక్ష లో కూర్చున్నారు.
నేడు కరోన విపత్తు కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు, చిరువ్యాపారులు, చిన్నతరహా పరిశ్రమలు, పేదల స్థితిగతులను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం 50మంది బడాబాబులు తీసుకున్న 69వేల కోట్ల రూపాయలను ఒక్క కలం పోటుతో రద్దుచేసి పేదల,రైతుల కార్మికుల వెతలు పట్టించుకోక పోవడం దుర్మార్గపు చర్యలు అని వారు విమర్శించారు.
కార్పొరేట్ కంపెనీల దత్తపుత్రుడుగా మోడీ
మోడి అధికారంలోకి వచ్చిన 6సంవత్సరాలలో 6.66లక్షల కోట్ల రూపాయలు రుణ బకాయిలును మాఫీ చేసి కార్పొరేటు శక్తుల దత్త పుత్రుడు గా నిరూపించు కొన్నారని అన్నారు. కరోన మహమ్మారి పేదలజీవనాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రదాని మోడి పేదలకు నామమాత్రపు ప్యాకేజీ ఇచ్చారని వారన్నారు.
లాక్ డౌన్ వలన ముఖ్యంగా వలస కూలీలు ఎక్కడి వారక్కడే ఉండి పోవాల్సిన పరిస్తితి వచ్చిoదని, వారు వారీ కుటుంబాల గురించి తీవ్ర వేదన అనుభవించారని ఈశ్వరయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని గిడ్డంగిలలో నిల్వఉన్న ఆహార ధాన్యం లో కోటి టన్నులు రాష్ట్రాలకు విడుదల చేయాలని, రబీ సీజన్లో ఉత్పత్తి అయినా ధాన్యంను జిల్లా ప్రజలకు పంపిణీ చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి పేదవానికి 50 కేజీల బియ్యం ,30కేజీల గోధుమలు ఇవ్వాలని, దీనితో పాటు కేంద్రం 5,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 చొప్పున మొత్తం 10,000 ఆర్దిక సహాయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.