ప్రొఫెసర్ హరగోపాల్పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేయడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రొఫెసర్ హరగోపాల్పై దేశ ద్రోహం కేసు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తప్పుపట్టారు. హరగోపాల్ ఒక ప్రొఫెసర్ అని, ఆయనకు ఎవరితోనూ సంబంధాలు లేవని నొక్కిచెప్పారు. హరగోపాల్పై కేసు పెట్టడాన్ని వ్యతిరేకించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వ్యక్తి హరగోపాల్ అని నారాయణ గుర్తుచేశారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలని, కేసీఆర్ జోక్యం చేసుకుని హరగోపాల్పై ఎలాంటి కేసు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేసీఆర్ను ఉద్యమ ద్రోహిగా చూడాల్సి ఉంటుందన్నారు. గతంలో వరవరరావుపైనా ఇలానే దేశద్రోహం కేసు పెట్టారని, ఆయన్ని జైల్లో వేశారని వివరించారు.మహిళలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవమానిస్తోందని, న్యాయం కోసం పోరాటం చేస్తున్న మహిళ రెజ్లర్లకు న్యాయం జరగడం లేదని, బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవడం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే బీహార్లో జరిగే విపక్షాల సభకు సీఎంలు కేసీఆర్, జగన్తోపాటు టీడీపీ నేత చంద్రబాబు హాజరు కావాలని డిమాండ్ చేశారు.
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదంటూ కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. అటు తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం రాలేదని గవర్నర్ అన్నారని, మరి పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్టప్రతిని ఎందుకు పిలవలేదంటే గవర్నర్ దగ్గర సమాధానమూ లేదన్నారు. ఏదో జగన్ ప్రభుత్వంపై బీజేపీ మొక్కుబడిగా మాట్లాడుతోందని, మోదీ ప్రభుత్వానికి జగన్ కట్టుబానిసని, ఆయన్ను బీజేపీ ఎందుకు వదులుకుంటుందంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో వెళ్లాలనే దానిపై సీపీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదని నారాయణ తెలిపారు.