అష్టాదశ శక్తి పీఠాలు ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరిగే జోగులాంబ దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలపై శుక్రవారం ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ధర్మకర్తలు సమావేశమయ్యారు. దేవస్థాన కార్య నిర్వహణ అధికారి పురంధర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
రోజురోజుకు ఆలయానికి పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగ్గట్టు వాహనాల పార్కింగ్ స్థలాన్ని పెంపొందించేందుకు స్థలాన్ని అన్వేషించారు. అదేవిధంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న పాత ఆస్పత్రి భవనాన్ని పరిశుభ్రం చేయించి అక్కడ ప్రాయశ్చిత్త కార్యక్రమాలు నిర్వహించి పలువురు పీఠాధిపతులు ఆహ్వానించి ఆ స్థలానికి పవిత్రత చేకూర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జనవరి 26వ తేదీన జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తారు కాబట్టి ఆలయంలో జరిగేటువంటి అభిషేక కార్యక్రమాలు మరియు అమ్మవారి నిజరూప దర్శనం ప్రముఖుల ప్రవచనాలు వంటి కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రచారం చేసేందుకు ఎల్ఈడి టీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
అదేవిధంగా భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించేందుకు ఇకపై లడ్డు ప్రసాదాలను సువాసన నేతితో తయారు చేయించాలని తీర్మానించారు. జోగులాంబ అమ్మవారి దర్శనం కొరకు తొక్కేసేలాట రద్దీ నియంత్రించేందుకు భక్తుల దర్శనాలకు ఆలయం ముందుండే రాజగోపురం నుండి పంపించి తిరుగు మార్గంలో ఆలయం వెనకాల రాజగోపురం నుండి వెళ్లే విధంగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయించాలని తీర్మానం చేశారు.
కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు బ్రాహ్మణ కొట్కూరు దగ్గర నుండి అలంపూర్ ఆలయాలకు చేరుకునే మార్గాన్ని భక్తులకు సూచించే విధంగా అక్కడ రెండు ఆర్టికేట్లు ఏర్పాటు చేసేందుకు దేవస్థానం పాలకమండలి తీర్మానించింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఈవో పురంధర్ కుమార్ దేవస్థాన పాలకమండల సభ్యులు జయన్న, అనంత ఈశ్వర్ రెడ్డి, ఉషాదేవి, చిన్నకృష్ణయ్య, మద్దిలేటి, హరిబాబు, నటరాజ్ యాదవ్, ఆనంద్ శర్మ ,ఆలయ సిబ్బంది శ్రీనివాసులు ,రంగనాథ్ బ్రహ్మయ్య ఆచారి పాల్గొన్నారు