రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తిరస్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చిందని ఆయన అన్నారు. ఆనాడు అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ప్రకటించగానే వైఎస్ఆర్ సీపీతో సహా అన్ని పార్టీలూ హర్షం వ్యక్తం చేశాయని, ఇదే జగన్మోహన్ రెడ్డి ఆనాడు రాజధానికి 33 వేల ఎకరాలు అవసరమని చెప్పారని రామకృష్ణ గుర్తు చేశారు.
స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ విచ్చేసి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారని, అమరావతి కోసం కేంద్రం రు.1550 కోట్ల నిధులను కూడా విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటికీ రు.9600 కోట్లు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఉద్యోగులకు క్వార్టర్లు, గృహ నిర్మాణాల వంటి అభివృద్ధి ఇప్పటికే జరిగిందని రామకృష్ణ తెలిపారు.
రాజధాని తరలింపు వల్ల రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుందని తద్వారా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఈ బిల్లులు ఆమోదయోగ్యం కాదని, రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు బిల్లులను తిరస్కరించని పక్షంలో రాష్ట్రపతికి వద్దకు పంపాలని రామకృష్ణ కోరారు.