కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాల్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ లకు తొత్తులు గా మారుతున్నాయని శ్రీకాకుళం సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు అన్నారు. పథకం ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రయత్నాల్ని ఎంత మాత్రమూ సహించేది లేదని నరసింహులు మండి పడ్డారు.
కేంద్రం రాష్ట్ర ప్రభుత్వల పనితీరుకు నిరసనగా సోమవారం శ్రీకాకుళం నగరంలోని కామ్రేడ్ దాసరి క్రాంతిభవన్ వద్ద నిరసన తెలిపిన అనంతరం మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు లక్షల మంది కరోనా వ్యాధి బారిన పడుతున్నారని ఆయన అన్నారు.
అదానీలకు అంబానీలకే ప్రాధాన్యం
ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా లాభాల్లో ఉన్న వివిధ ప్రభుత్వరంగ సంస్థల్ని అదానీ, అంబానీ గ్రూపులకు ధారాదత్తం చేస్తున్నారని తెలిపారు. దీనిని వ్యతిరేకించినందుకు వామపక్ష పార్టీ ప్రధాన నాయకులైన సీతారాం ఏచూరి వంటి నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారన్నారు.
కేంద్రప్రభుత్వం దేశప్రజలకు కరోనాను నిర్ములించడంలోనూ, ఉపాధి, రక్షణ కల్పించడంలోనూ పూర్తి వైఫల్యం చెందినట్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్ లోని సిపిఐ పార్టీ కార్యాలయం పై ఆర్ ఎస్ ఎస్ గుండాల దాడిని ఆయన ఖండించారు. లాభాల్లో ఉన్న 26 ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైనదన్నారు.
ఇప్పటికే ఎయిర్ లైన్స్, రైల్వే, బొగ్గు గనులతో పాటు అంతరిక్ష పరిశోధనలు సైతం ప్రైవేటీకరణ జరుగుతుందన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న దుర్గాపూర్, విశాఖపట్నం లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ లను కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
మూడు రాజధానుల పేరుతో ఏపి నాశనం
ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పేటప్పుడు మోడీ ప్రభుత్వం దేశాన్ని పరిపాలించడం అవసరమా అని ప్రశించారు. కార్పొరేట్ అనుకూల విధానాలని కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. మరో వైపు రాష్ట్రా ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో పూర్తిగా సంక్షేమాన్ని పక్కన పెట్టిందని, భారత కమ్యూనిస్టు పార్టీ గా తాము ఒకేదగ్గర రాజధాని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలోనే రెండవ స్థానంలో ఉందంటే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఏవిధంగా ఉన్నాయో ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. సామాన్య పేదప్రజలు విరివిగా ఉపయోగించే వంట గ్యాస్ పైన 10శాతం అంటే రూ. 60 పైబడి రుసుము పేదవాడి పై భారం పడిందని, ఈ క్రమంలో ఇప్పటికే అనేక కష్టాలో పేద ప్రజల నడ్డి విరిచినట్లేనని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా లో వర్షాభావం తక్కువ వలన ఖరీఫ్ లో నాటిన యదలు, దమ్ములు పూర్తవ్వక రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ పరిస్థితుల్లో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు బలగ శ్రీరామ్మూర్తి,మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు పట్టా ప్రభావతి, దళిత హక్కుల పోరాట జిల్లా అధ్యక్షులు యడ్ల గోపి,భవన నిర్మాణ కార్మిక జిల్లా నాయకులు పట్టా ప్రసాదు , మెట్ట లక్ష్మణమూర్తి, నిమ్మాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.