అడవులు నరికి వేతకు పాల్పడే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదుతో పాటు నరికిన చెట్లకు వెల నిర్ణయించి రికవరీ చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. పోడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు ముమ్మరంగా సర్వే ప్రక్రియ జరుగుతున్నదని, మరో పక్క నూతనంగా అడవులు నరికివేత చర్యలకు పాల్పడుతున్నారని అటువంటి వారిపై చట్ట పరంగా తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నూతనంగా అడవులు నరికివేతకు పాల్పడే వ్యక్తులకు గతంలో జారీ చేసిన పొడుపట్టాలు కూడా రద్దు చేస్తామని చెప్పారు. పోడు వ్యవసాయం పేరుతో అడవులు ధ్వంసం చేస్తున్నారని, ఇట్టి చర్యలను ప్రభుత్వపరంగా చాలా సీరియస్ గా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటవీ భూములు ఆక్రమించుటకు ప్రయత్నించినా, ప్లాంటేషన్స్ ధ్వంసం చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని చెప్పారు. అడవులు నరికివేతకు పాల్పడే వ్యక్తులను ఏ మాత్రం ఉపేక్షించమని ఆయన స్పష్టం చేశారు. పోడు దరఖాస్తులు స్వీకరణ ఆధారంగానే సర్వే ప్రక్రియ జరుగుతున్నదని, కొంతమంది నూతనంగా అడవులు నరికివేతకు పాల్పడుతున్నారని చెప్పారు. నూతనంగా అడవుల ద్వంసానికి పాల్పడొద్దని పలు మార్లు విజ్ఞప్తి చేశామని అయినప్పటికీ జిల్లాలో అక్కడక్కడ అడవులు నరికివేత జరుగుతున్నదని, అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు నరికిన చెట్లుకు ధర నిర్ణయించి వారి నుండి రికవరీ చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
previous post