ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని, దీంతో ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో రహదారి భద్రత కార్యక్రమాలపై డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు భద్రత కు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. కూడళ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన తెలిపారు. జిల్లాలోని నేషనల్ హైవే పోనూ మిగులు రోడ్ల విస్తరణకు చర్యలు చేపట్టాలన్నారు. క్రొత్తగా చేపట్టిన హైవే ప్రాజెక్టుల వద్ద హెచ్చరిక బోర్డులు, లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్వోబి ల క్రింద అందుబాటులో ఉన్న స్థలంలో ఆక్రమణల తొలగింపుచేసి, ఆటోల, టూ వీలర్ల పార్కింగ్ తదితర అవసరాల కొరకు వినియోగించాలన్నారు. ఆర్ అండ్ బి రోడ్లపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలన్నారు. రోడ్ల కిరువైపులా ఆక్రమణల తొలగింపు చేయాలన్నారు. ఆసుపత్రిలో న్యూరో, ఆర్థోపెడిక్ సర్జన్లు అందుబాటులో ఉంచాలని, ట్రామా కేర్ సిబ్బంది తగినంత ఉండాలని అన్నారు. స్కూల్, కళాశాల పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.
సోలార్ బ్లింకర్లు, రోడ్డు భద్రతా సంబంధ పనులు 15 ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలన్నారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, జంక్షన్ల అభివృద్ధి పై పోలీస్ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్, మద్యపానం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. హైవే రహదారుల అభివృద్ధికి నేషనల్ హైవే అధికారులు, ఎసిపిలు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని అన్నారు. బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు డిసిపి ఏఎస్ సి బోస్, ఇఇ శ్యామ్ ప్రసాద్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, ఇఇ పీఆర్ కెవికె. శ్రీనివాస్, జిల్లా రవాణాధికారి టి. కిషన్ రావు, నేషనల్ హైవే పిడి దుర్గాప్రసాద్, ఏఎస్పీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.