అకాల వర్షాలు వలన కంకులు ఎండిపోయి పంట అంతా తాలుగింజలు వచ్చి నష్టపోయిన ఏలూరు జిల్లా
చొదిమెళ్ళకు చెందిన వరి రైతు వాడవల్లి సాంబశివరాజుకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక చొదిమెళ్ళ గ్రామంలో దొండపాడు చెరువు ఆయకట్టు లో ఎనిమిది ఎకరాల్లో సాగు చేసిన వరి కంకి ఎండు తెగులుతో జరిగిన పంట నష్టాన్ని రైతు సంఘం నాయకులు శనివారం పరిశీలించారు.
నష్టం వివరాలను రైతు సాంబశివరాజును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ వరి పంట ఈనిక వచ్చిన తర్వాత గింజ తయారు కాకుండా పంట అంతా తాలు రావడంతో రైతు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఎకరాకు రూ.30వేలకు పైగా పెట్టుబడి పెట్టారని 8 ఎకరాలకు రూ.2 లక్షల 50వేలు పెట్టుబడి అయిందన్నారు. కంకి పాలు పోసుకుని గింజ తయారై పంట కోతకు వచ్చే దశలో కంకులు ఎండిపోవడంతో వచ్చిన తెగులు ఏమిటో కూడా
అర్థం కాక నష్టపోయి వరి రైతు సాంబశివరాజు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు వెంటనే పర్యటన చేసి పరిశీలించి తెగులు నిర్ధారణ చేసి నష్టపోయిన రైతును అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 10వ తేదీన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతు వాడవల్లి సాంబశివరాజు, రైతుకు మద్దతుగా వాడవల్లి కొండప్ప, వాడవల్లి స్వామి, వి. సాయి, వి.మణికంఠ,వి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.