సమాజానికి శాంతియుత వాతావరణాన్ని అందించే క్రమంలో టెర్రరిస్టులు, మావోయిస్టులు, సంఘవ్యతిరేక శక్తులతో నిరంతరం పోరాడుతూ, దేశవ్యాప్తంగా వీరమరణం పొందిన పోలీసు అమరవీరులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (పోలీసు ఫ్లాగ్ డే) జరుపుకుంటున్నామని ఈ నేపథ్యంలో అక్టోబర్ 21 నుండి 31 వ తేదీ వరకు జిల్లాలోనూ పలు సామాజిక సేవ, పోలీసు విధుల గురించిన అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వ రావు తెలిపారు.
ఇందులో భాగంగా జిల్లాలో ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిలిమ్ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. పోటీలలో పాల్గొనేవారు పోలీసు విధులకు సంబంధించిన వివిధ రకాల సేవలపై మూడు నిముషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ , జిల్లా పోలీసు సిబ్బంది వివిధ సందర్భాలలో చేసిన, చేస్తున్న సామాజిక, మానవీయ కోణంలోని విధులకు సంబంధించిన ఫోటోలు, పోలీస్ ఇమేజ్ చాటే సహజమైన ఫోటోలు అందించాలని తెలిపారు.
జిల్లాలోని ప్రతిఒక్కరినీ ఈ పోటీలకు ఆహ్వానిస్తున్నామని, పోలీసుపై ఎంతగానో అభిమానం చూపే జిల్లా ప్రజలు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని ఎస్పీ పిలుపునిచ్చారు. షార్ట్ ఫిల్మ్ చిత్రాలు నిర్మించినవారు పెన్ డ్రైవ్ ద్వారా మరియు ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొనేవారు 10X8 సైజులో మూడు ఫోటో కాపీలను ఈ నెల అక్టోబర్ 23 తేదీ లోపుగా, తమ పూర్తి వివరాలతో జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీస్ పి.ఆర్.ఓ. కు అందజేయాలని ఎస్పీ సూచించారు.
అదేవిధంగా పాఠశాల. కళాశాల విద్యార్థులకు రెండు విభాగాలుగా ఆన్ లైన్ లో వ్యాస రచన పోటీలు ఉంటాయని, వివరాలు త్వరలోనే మీడియా ద్వారా వెల్లడిస్తామని తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వందలాది పోలీసు అధికారులు, సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పిస్తున్నారని, అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలు, కార్యక్రమాలలో విద్యార్థులతో పాటుగా యువత, ప్రజలు పాల్గొనాలని ఎస్పీ తెలిపారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్