క్రిప్టోకరెన్సీ కారణంగా ప్రపంచ దేశాలలో మనీలాండరింగ్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఉగ్రవాద సంస్థలకు క్రిప్టోకరెన్సీ ద్వారా ఫండింగ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఆమె అన్నారు.
ఈ రెండు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు క్రిప్టోకరెన్సీలను నియంత్రించాలని ఆమె కోరారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) నిర్వహించిన అత్యున్నత స్థాయి ప్యానెల్ చర్చలో పాల్గొన్న ఆమె తన అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పారు. క్రిప్టోకరెన్సీ వల్ల అన్ని దేశాలకు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉన్న అంశాన్ని అందరూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కూడా అన్నారు.
అంతకుముందు నిర్మలా సీతారామన్తో జరిగిన సమావేశంలో, IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ భారత్ అనుసరిస్తున్న మిశ్రమ ఆర్ధిక విధానం మంచి ఫలితాలను ఇస్తున్నదని అన్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారతదేశం చేసిన సహాయాన్ని జార్జివా ప్రశంసించారు.
భారత్ చేస్తున్న రీతిలోనే IMF కూడా ఆ దేశానికి తనవంతు సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. నిర్మలా సీతారామన్, జార్జివా ప్రపంచ వృద్ధిపై భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో సహా అనేక సమస్యలపై చర్చించారు. పెరుగుతున్న ఇంధన ధరలు ఇటీవల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా, భౌగోళిక, రాజకీయ పరిణామాల పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నదని దీని కారణంగా దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. మూలధన వ్యయం ద్వారా ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని నిర్మలా సీతారామన్ తెలిపారు.