సీఎం కేసీఆర్ రైతు ద్రోహి అని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల మండలాల్లో పర్యటించిన ఆయన కల్లాల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రోజులు గడుస్తున్నా అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కల్లాల్లో ఉన్న వరి, మొక్కజొన్నను యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ వర్గ నేతల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా వైరాలోని విప్పలమడక, కేజీ సిరిపురం, గరికపాడు, వైరాతో పాటు కొణిజర్ల మండలాల్లోని సింగరాయపాలెం గ్రామాలను సందర్శించిపలుకుటుంబాలను పరామర్శించారు.
పలు శుభకార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. పట్టువస్త్రాలను కానుకగా సమర్పించారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట విజయబాయి, బొర్రా రాజశేఖర్, సూతగాని జైపాల్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, ధార్నా రాజశేఖర్, చింతనిప్పు సుధాకర్, ఎస్.కె. రెహమాన్, తూము వెంకటేశ్వర్లు, రాయల పుల్లయ్య, గుండ్ల కోటేశ్వరరావు, కన్నెగంటి రావు, పణితి సైదులు, నాగులు తదితరులు ఉన్నారు.