రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి అంశాల పై కలెక్టర్ లతో సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి ధరణి వెబ్ సైట్ లో ఉన్న మాడ్యుల్స్ ను పిపిటి ద్వారా వివరించారు. దరఖాస్తులోని ఆధారాలను పరిశీలించి, అందుబాటులో ఉన్న కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ సూచించారు.
జిల్లాలోని ప్రతి 3మండలాలకు ఒక బృందం ఏర్పాటు చేయాలని, ప్రతి మండల కేంద్రంలో 3 రోజులకు మించకుండా రెవెన్యూ సదస్సులను మండల హెడ్ క్వార్టర్ లో నిర్వహించాలని సిఎస్ సూచించారు. జూలై 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.
రెవెన్యూ సదస్సుల నిర్వహణ పై చర్చించేందుకు సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్ లతో జూలై 11న హైదరాబాదులోని ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. సీఎం కేసీఆర్ సమీక్ష నాటికి జి.ఓ.58 కింద వచ్చిన దరఖాస్తుల ప్రాథమిక విచారణ ప్రక్రియ పూర్తిచేసి ఆ సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు
రెవెన్యూ సదస్సుల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 100 బృందాలను రెవెన్యూ ఉన్నతాధికారుల అధ్యక్షతన ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. రెవెన్యూ సదస్సులను విస్తీర్ణం కలిగిన వేదికల్లో నిర్వహించాలని, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, అవసరమైన కంప్యూటర్లు ప్రింటర్, జిరాక్స్ మెషిన్, కౌంటర్లు, మొబైల్ మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సి ఎస్ ఆదేశించారు.
మండల కేంద్రంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొనాలని, దానిని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ సదస్సులో ప్రణాళిక సరిహద్దు జిల్లాల అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని ఖరారు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. మండలాల్లోని గ్రామాలను విభజించి , గ్రామాల వారీగా రెవెన్యూ సరస్సులకు హాజరయ్యే తేదీల షెడ్యూల్ తయారు చేయాలని, రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ పై గ్రామాలలో టాంటాం ద్వారా ప్రచారం చేయాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రింట్ మీడియాలో షెడ్యూల్ ప్రచురితమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
జిల్లా కలెక్టర్ల తో జూలై 11న సీఎం కేసీఆర్ తో జరిగే సమావేశానికి రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం జిల్లా ప్రణాళికతో హాజరు కావాలని, ఆ ప్రణాళికలో జిల్లాలో ఏర్పాటు చేసే బృందాల వివరాలు, మండల కేంద్రాలలో వేదికలు, షెడ్యూల్ వంటి లాజిస్టిక్స్ వివరాలు సిద్ధం చేయాలని సి ఎస్ ఆదేశించారు రెవెన్యూ సదస్సుల సమయంలో వచ్చిన దరఖాస్తులను అర్హత మేరకు పరిష్కరించాలని, కోర్టు కేసులు, కుటుంబ తగాదాలు, సరైన డాక్యుమెంట్లు సమర్పించని కేసుల వివరాలతో కూడిన సమాధానం వారికి అందజేయాలని సిఎస్ సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ గురుకుల పాఠశాలలు మంజూరు చేసిన ప్రాంతాల్లో ఉండే విధంగా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారని సిఎస్ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఆగస్టు 15 నాటికి బీసి, ఎస్సీ స్టడీ సర్కిల్లో ఏర్పాటుకు సంబంధించి అవసరమైన స్థలాలు, భవనాలను ఎంపిక చేయాలని సిఎస్ కలెక్టర్లకు ఆదేశించారు జిల్లాలో చేపడుతున్న హరితహారం కార్యక్రమం, గ్రామీణ క్రీడ ప్రాంగణాల పురోగతి వివరాలు సైతం తయారు చేయాలని కలెక్టర్ లకు సీఎస్ తెలిపారు.
నిర్మల్ జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలో 19 మండలాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం 4 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కరికి 3 మండలాలను కేటాయించి రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ఇవ్వడంతో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని ప్రణాళిక రూపొందిస్తామని, రెవెన్యూ సదస్సుల కోసం అవసరమైన ప్రణాళిక తయారు చేస్తామని, తమరు సూచించిన సలహాలు, సూచనలు పాటిస్తామని తెలిపారు.
అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో ధరణి మాడ్యుల్స్, రెవెన్యూ సదస్సుల్లో నిర్వహించాల్సిన విషయాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ లు, రెవిన్యూ అధికారులతో టీమ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని మండలాల వారిగా రెవిన్యూ సదస్సులు ఏర్పాటు చేసి వారం లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు ఏ మాడ్యూల్ లోకి వస్తుందో అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే లోకల్ బాడీ, పి. రాంబాబు రెవిన్యూ, రెవిన్యూ డివిజనల్ అధికారులు తుకారామ్, లోకేష్ , మండలాల తహశీల్దార్లు, కలెక్టరేట్ ధరణి సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.