ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ తరలించడాన్నిజనసేన తీవ్రంగా ఖండిస్తుందోని కడప జిల్లా జనసేన రాయలసీమ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్ వద్ద ఉన్న కూరగాయల మార్కెట్ తరలించాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కూరగాయల మార్కెట్ ద్వారా దాదాపు 5 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రాచమల్లు కూరగాయల మార్కెట్ తరలించడాన్నితీవ్రంగా వ్యతిరేకించారని, కానీ ఇప్పుడు అధికారం వచ్చాక మాట మార్చి కూరగాయల మార్కెట్ తరలించడానికి పూనుకోవడం శోచనీయమన్నారు. పేద ప్రజలకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే అభివృద్ధి ముసుగులో నీచ రాజకీయాలకు పాల్పడడం సబబు కాదన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు ధనదాహానికి పాల్పడుతూ పేద ప్రజల కడుపులు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు ఆకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయల మార్కెట్ పై నిర్ణయాన్ని మార్చుకొని పక్షంలో జనసేన పేద ప్రజల పక్షాన పోరాడటానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలన అని చెప్పే అర్హత వైసీపీ కి లేదు.
జిల్లా వ్యాప్తంగా భూ కబ్జాలు మితిమీరి పోతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నగర అధ్యక్షుడు మాలే శివ, రామ్ సిద్దు ఇతర నాయకులు పాల్గొన్నారు.