రైతులు చిరుదాన్యాల పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ జె డి ఏ రామకృష్ణ అన్నారు. అంతర్జాతీయ చిరుదాన్యాల పంటల సాగు వారోత్సవాల సందర్భంగా ఏలూరు జిల్లా పెదవేగి మండలం బి సింగవరం గ్రామంలో రైతు సభ జరిగింది. గ్రామ సర్పంచ్ పరసా సరస్వతి, మండల వ్యవసాయాధికారి పి ప్రియాంక అధ్యక్షతన శనివారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆంద్రప్రదేశ్ వ్యవసాయ కమిషనరేట్ పురుగుమందుల విభాగ అధికారి ఎన్ సరళ, ఏలూరు వ్యవసాయ శాఖ జె డి ఏ రామకృష్ణ, వ్యవసాయ శాఖ ఏ డి ఏ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జె డి ఏ రామకృష్ణ మాట్లాడుతూ పూర్వీకులు ఆహార దాన్యాలతో సమానంగా చిరుదాన్యాలను కూడా సాగుచేసి అధిక దిగుబడులతో బాటు అధిక లాబాలనుకూడా పొందేవారని బి సింగ వరం రైతులకు గుర్తు చేశారు.
ప్రస్తుత కాలంలో రైతులు చిరుదాన్యాల పంటల సాగుపై శ్రద్ధ తగ్గించారన్నారు. సమాజంలో చాలామంది ప్రజలు ఆరోగ్యం కాపాడుకునేందుకు మామూలు ఆహారం వదిలి చిరుదాన్యాలనే ఆహార పదార్థాలుగా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని రామకృష్ణ చెప్పారు. మెట్ట భూముల్లో వులవలు, కందులు, జొన్న, చోడి, గంటేలు, అలచందలు వంటి పంటలు అధిక విస్తీర్ణాలలో పండించేవారన్నారు. మాగాణి భూముల్లో వరిసాగు అనంతరం రైతులు ఆరుతడి పంటలుగా పెసలు, మినుము, కంది, మొక్కజొన్న అధికంగా సాగుచేస్తున్నారని వివరించారు.
మెట్ట మండలాలలో కూడా రైతులు చిరు ధాన్యాల సాగు పెంచుకోవాలని రైతులకు జె డి ఏ రామకృష్ణ సూచించారు. చిరు ధాన్యాలు పండించే రైతులకు ప్రభుత్వం రాయితీల ద్వారా చిరుదాన్యాల విత్తనాలు సరఫరా చేస్తుందన్నారు. పురుగుమందుల విభాగ అధికారిని సరళ మాట్లాడుతూ చిరుదాన్యాలలో వచ్చే చీడ పేదల నివారణకు కావాల్సిన మందులతో పాటు సలహాలు సూచనలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామకార్యదర్శి డి విజయ్ కుమార్ తో పాటు సచివాలయ వ్యవసాయాధికారులు గ్రామరైతులు సుమారు 50 మంది పాల్గొన్నారు.