రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులు, పోలీస్ తదితర శాఖల అధికారులతో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చెక్ పోస్టులు ఏర్పాటు అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించకుండా అక్రమ రవాణా నియంత్రణకు రాష్ట్ర సరహద్దు జిల్లాల్లో అవసరమైన చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జాతీయ రహదార్లు, రాష్ట్ర రహదార్లు తదితర ముఖ్యమైన ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే చెక్ పోస్టుల్లో నిరంతర తనిఖీలు చేపట్టడంతోపాటు అక్కడ సిసి కెమెరాలతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబరు 14500 ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పంచాయితీరాజ్, పోలీస్, ఎక్సైజ్, భూగర్భ గనులు తదితర శాఖలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఇసుక అక్రమ రవాణా నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో పంచాయీతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ సురేంద్రబాబు, గనులశాఖ కార్యదర్శి రామ్గోపాల్, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
previous post