జగన్ రెడ్డి బాదుడే బాదుడు ఎన్నికలు దగ్గరపడుతున్నా ఆగడం లేదు. ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులను కొల్లగొడుతున్న జగన్ ఇప్పుడు మళ్లీ మరో సారి విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్ధపడుతున్నారు. జగన్ సీఎం అయిన నాటి నుంచి అంటే దాదాపుగా ఐదేళ్లుగా విద్యుత్ చార్జీల మోత మోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ కూడా వినియోగదార్లను వదిలిపెట్టలేదు. ఇంధన సర్దుబాటు చార్జీలుగా 1148.72 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేసి జెన్కోకు చెల్లించాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నింయత్రణ మండలి ఆదేశించింది.
ఇప్పటికే ఏడు సార్లు కరెంటు చార్జీలను పెంచిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరో మారు ప్రజలపై కత్తి విసిరింది. 2018-19 నుంచి 2022-23 వరకు విద్యుత్ ఉప్పత్తి కోసం జెన్కో బొగ్గు, ఇతర ఇంధన ఉత్పత్తుల కోసం చేస్తున్న వ్యయాలకు డిస్కంలకు సరఫరా చేస్తున్న విద్యుత్ ధరకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉందని ఈఆర్సీ ముందు జెన్కో వాదించింది.
దాంతో చార్జీలు పెంచేందుకు ఈఆర్సీ అనుమతించింది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బిల్లులపై మళ్లీ చర్చ జరుగుతోంది. ట్రూఅప్ చార్జీలు, సర్చార్జీలు, ఇతర రుసుముల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని నిరసన వ్యక్తం అవుతోంది. మరోవైపు రాజకీయంగానూ ఈ విద్యుత్ బిల్లుల వివాదం దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన విమర్శలు సంధిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో వినియోగదారులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దీనిలో కేటగిరి-1గా సాధారణ ప్రజలు, కేటగిరి-2గా వ్యాపారులు, కేటగిరీ-3గా పరిశ్రమలు, కేటగిరీ-4గా యుటిలిటీస్, కేటగిరీ-5గా వ్యవసాయదారులు వస్తారు. వీరిలో కేటగిరీ-1 గురించి చూస్తే మినిమం ఎనర్జీ చార్జెస్ పేరుతో బిల్లులు వసూలు చేస్తుంటారు. విద్యుత్ వినియోగం ఆధారంగా ఈ చార్జిని లెక్కిస్తారు.
ఫిక్సెడ్ చార్జెస్ పేరుతో జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తున్నది. విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లతోపాటు విద్యుత్ సిబ్బంది సేవలను ఉపయోగించుకుంటున్నందుకు ఈ చార్జీలు వసూలు చేస్తారు. అంటే విద్యుత్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునేందుకు వసూలు చేసే అద్దెగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది బిల్లు బిల్లుకూ మారుతుంది. మన మీటర్ మొత్తం లోడు(మన ఇంట్లోని అన్ని విద్యుత్ ఉపకరణాల కోసం నిర్దేశించిన మొత్తం యూనిట్లు)తోపాటు మనం ఏ శ్లాబులో ఉన్నాం, ఎంత బిల్లు కడుతున్నాం లాంటి అంశాల ఆధారంగా ఈ చార్జి ఉంటుంది. అంతే కాకుండా కస్టమర్ చార్జి పేరుతో కూడా జగన్ ప్రభుత్వం ప్రజల్ని దోచేస్తున్నది. మనం విద్యుత్ ఉపయోగించినా లేకున్నా కస్టమర్ చార్జి చెల్లించాల్సి ఉంటుంది.
అదే విధంగా ప్రతి వినియోగదారుడి నుంచి జగన్ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డ్యూటీ (విద్యుత్ సుంకం) రూపంలో సుంకాన్ని వసూలు చేస్తున్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. బిల్లు కట్టడంలో ఆలస్యమైనప్పుడు ఎలక్ట్రిసిటీ డ్యూటీపై వడ్డీని ఇంట్రస్ట్ ఆన్ ఈడీ పేరుతో వసూలు చేస్తున్నారు. బిల్లు కట్టడానికి వినియోగదారులకు 15 రోజుల గడువు ఇస్తారు. ఈ లోగా బిల్లు కట్టకపోతే ఈ వడ్డీ పడుతుంది.
ఇవి కాకుండా సర్చార్జ్, షార్ట్ ఫాల్, ట్రూ అప్ చార్జి, ఎఫ్పీపీసీఏ చార్జెస్ అంటే ఫ్యూయల్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ లను కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం వసూలు చేస్తున్నది. బొగ్గు లేదా ఇంధనం ధరల్లో పెరుగుదలను నేరుగా వినియోగదారులకు బదిలీ చేసేందుకు తీసుకొచ్చిన సుంకం ఇది.
ఇలా చార్జీలపై చార్జీలు వసూలు చేస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నెత్తిన మోయలేని భారం మోపుతున్నది.