పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న స్మశాన వాటిక నిర్మాణ పనుల బిల్లుల కోసం 50 వేల రూపాయలు డిమాండ్ చేసిన ఈజిఎస్ ఏపీఓ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రతి గ్రామంలో స్మశాన వాటికలు నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది.
దానికోసం గ్రామాల్లో పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇదే అదునుగా భావించిన అధికారులు తమలోని లంచగొండిని బయటకు తీస్తున్నారు. డబ్బులిస్తేనే బిల్లులు చేస్తామన్న ఓ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపెట్ గ్రామంలో స్మశాన వాటిక పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను అదే గ్రామానికి చెందిన చిటుకుల నర్సారెడ్డి చేస్తున్నాడు. అయితే నిర్మాణానికి సంబంధించిన 10 లక్షల రూపాయల బిల్లులు ఇవ్వాలని ఏపీఓ రాజేందర్ ను నర్సారెడ్డి కోరగా బిల్లు ఇవ్వడానికి 50 వేల రూపాయలు డిమాండ్ చేశాడు.
దాంతో నర్సారెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. నేడు మధ్యాహ్నం ఏపీఓకు 10 వేల రూపాయలు ఇస్తుండగా నిజామాబాద్, మెదక్ ఏసీబీ డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. నర్సారెడ్డి ఈ నెల 24 న తమను సంప్రదించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేందర్ కు 10 వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు.