రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రవేశించినట్లు పుకార్లు వ్యాప్తి చెందడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రిలో 40 ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఎక్కడా కరోనా వైరస్ కు సంబంధించిన ఆనవాలు లేకపోయినా కొందరు రోగులు అనుమానంతో రావడంతో ఈ వార్డులలో చేర్చుకున్నారు.
ఈ వార్డులను ఎలా ఏర్పాటు చేశారనే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర వైద్య బృందాలు నగరంలోకి వచ్చాయి. నేడు వారు గాంధీ, ఫీవర్ ఆసుపత్రులను తనిఖీ చేశారు. పుకార్లను నమ్మి భయాందోళనలకు గురి కావద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం నాడు కోరారు. చైనాకు చెందిన కరోనా వైరస్ కు సంబంధించిన కేసులు ఎక్కడా ధృవీకరణ కాలేదని ఆయన అన్నారు. భారత్ లో గానీ, తెలంగాణలో గానీ కరోనా వైరస్ పై కేసులు లేవు. రాష్ట్రంలో కరోనో వైరస్ వ్యాప్తి సంబంధించిన రుజువులు లేవు అని కేంద్ర వైద్యులు కూడా ప్రకటించారు. కరోనా అనుమానిత కేసులను కనుగొన్న తరువాత, గాంధీ, ఫీవర్ మరియు చెస్ట్ ఆసుపత్రులను నోడల్ కేంద్రాలుగా ప్రకటించారు. ఆరోగ్య శాఖ నిర్దేశాల ప్రకారం కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేక బెడ్లు, వార్డులను ఏర్పాటు చేశారు. గాంధీలో 40 ప్రత్యేక ఐసోలేషన్ వార్డులుగా, ఫీవర్ ఆసుపత్రిలో 40, చెస్ట్ ఆస్పత్రిలో 20 ఐసోలేటెడ్ బెడ్ లను ఏర్పాటు చేశారు.