బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం వున్నందున విజయనగరం జిల్లాలో ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు సంభవించకుండా అన్ని శాఖల అధికారులు వచ్చే నాలుగు రోజులపాటు అప్రమత్తంగా వుంటూ తగు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్, జిల్లా ప్రత్యేక అధికారి సురేష్ కుమార్ ఆదేశించారు.
తుఫానుల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా వుండాలన్నారు. సీఎం జగన్ తుఫానులపై సమీక్ష నిర్వహించి ప్రత్యేక అధికారులంతా ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ప్రత్యేక అధికారి జిల్లాకు చేరుకున్న ఆయన ఈ సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నాగలక్ష్మి ఎస్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్లతో కలసి జిల్లా అధికారులతో తుఫాను సహాయక చర్యలపై సమీక్షించారు.
జిల్లాలో ప్రస్తుతం ఎలాంటి పంటనష్టాలు నమోదు కానప్పటికీ రానున్న రోజుల్లో భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినకుండా రైతులను అప్రమత్తం చేయాలన్నారు. వరి, మొక్కజొన్న తదితర పంటలు ఏ దశలో వున్నదీ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నందున రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తుఫానుల కారణంగా మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాల్సి ఆదేశించారు. ముఖ్యంగా సముద్రం ఒడ్డున వున్న వలలు, పడవలు తుఫాను సందర్భంగా కొట్టుకుపోకుండా వాటిని భద్రపరిచేలా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. రోడ్లకు ఏమైనా నష్టాలు వాటిల్లిందీ లేనిదీ ప్రత్యేక అధికారి ఆరా తీశారు.