ఆత్మ రక్షణ ఉద్యమాల కోసం బహుజన ఐకాస బాలకోటయ్య పిలుపు
చరిత్రలో జరిగిన ఫాసిజం, నాజీ ఇజంలా, తెలుగు నేలపై రజాకార్ల పరిపాలనలా, రాష్ట్రంలో మళ్ళీ అలాంటి రాజ్య ప్రేరేపిత పాలనా హింస జరుగుతుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వమే హింసకు పాల్పడుతున్న రీత్యా,ఆత్మ రక్షణతో కూడిన ఉద్యమాలు దళిత బహుజన కులాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఎవరో వస్తారు, ఏదో చేస్తారనే పరిస్థితులు రాష్ట్రంలో లేవని, దళిత బహుజన కులాల హక్కుల కోసం, కొట్లాడుతున్న ఉద్యమకారులంతా, వారి ఆత్మ రక్షణ కొరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని గుర్తు చేశారు. మాచర్ల, గుంటూరు, మంగళగిరి వంటి సంఘటనలు ఒక రాజకీయ పార్టీకి చెందినవి మాత్రమే కావని, ఈ దాడుల సంఘటనల ద్వారా ప్రభుత్వం ప్రశ్నించే అందరికీ హెచ్చరికలు జారీ చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, చీరాల కిరణ్ బాబు, కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, పులివెందుల నాగమ్మ, నంద్యాల మహాలక్ష్మి, గుంటూరు భూక్యాకాంత్, నంద్యాల అబ్దుల్ సలాం, కర్నూలు వజీరా,ఎస్సీలపై ఎస్సీ అట్రాసిటీ కేసులు వంటి ఘటనలు దళిత, బహుజన కులాలను భయభ్రాంతులకు గురి చేసే వ్యూహంలో భాగమే అన్నారు. పరిపాలించాల్సిన ప్రభుత్వమే హింసను ప్రేరేపిస్తుందని, ప్రశ్నించే వారిని అక్రమ కేసులతో జైల్లో పెడుతుందని చెప్పారు.
దళిత జడ్పిటిసి కుర్చీ పై మూత్ర విసర్జన చేసినా, 15 ఏళ్ల మైనర్ బాలికపై పైశాచిక అత్యాచారం చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేదని చెప్పారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మొదటి ముద్దాయి ఎమ్మెల్సీ అనంతబాబును ఇప్పటికీ పదవిలో ఉంచటం ద్వారా దళిత కులాలను అగౌర పరిచినట్లేనని తెలిపారు.
ఆత్మ రక్షణ పోరాటం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, తెగింపుకు మారుపేరైన కింది కులాల నాయకులు అప్రమత్తంగా ఉండాలని, క్రింది కులాల నాయకుల పై ప్రభుత్వం, వైకాపా పోలీసులు ఎలాంటి హింసకు పాల్పడినా, రానున్న కాలంలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా దళిత, బహుజన సంఘాల నాయకులు ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాలని బాలకోటయ్య పిలుపు నిచ్చారు.