విజయనగరం జిల్లా ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు ప్రతీ ఏడాది నిర్వహించే 15 రోజుల పునశ్చరణ తరగతులను ఈ నెల 21 నుండి మార్చి 7 వరకు నిర్వహించనున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ పోలీసు విధులను నిర్వహించినపుడు నిష్పక్షపాతంగా, అంకిత భావం, నిజాయితీతో వ్యవహరించి, ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు.
విధుల్లో నైపుణ్యాన్ని సాధించేందుకు ప్రతీ ఏడాది నిర్వహించే పునశ్చరణ తరగతులు (మొబిలైజేషను)ను సద్వినియోగం చేసుకొని, శారీరక ధారుడ్యాన్ని, ఆయుధాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. యూనిఫాం ధరించిన తరువాత ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణకే పోలీసులు పునరంకితం కావాలని పోలీసు అధికారులు, సిబ్బందికి పిలుపునిచ్చారు. 15 పని రోజుల పాటు సాగే ఈ పునశ్చరణ తరగతులతో వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలన్నారు.
ప్రస్తుత పరిస్థితులు, అవసరాల దృష్ట్యా ఈ మొబిలైజేషనులో ఆర్మ్ పోలీసులకి వ్యక్తిత్వ వికాసాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్ధిక స్థితులను మెరుగుపర్చేందుకు ప్రణాళికాయుతంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలు అన్ని కూడా పోలీసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. వీటితోపాటు రిజర్వు పోలీసుల వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శారీరక దారుఢ్యం పెంచేందుకు, వివిధ ఆయుధాల ఉపయోగాలను, ముఖ్యమైన బందోబస్తు విధులను ఏవిధంగా నిర్వహించాలో, ఫైరింగ్ ప్రాక్టీసు, బాంబు స్క్వాడ్ పనితీరు ఏవిధంగా చేపట్టాలో, మస్కటీ శిక్షణను అందించనున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎం.ఎం. సోల్మన్, ఏఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి, పలువురు ఆర్ఎస్ఐలు నారాయణరావు, శ్రీనివాసరావు, ప్రసాదరావు, నీలిమ, కేశవరావు, పలువురు ఎఆర్ఎస్ఐలు, ఎఆరెచ్సీలు ఎఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.