ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా హుజూర్ నగర్ రోడ్లు తయారయ్యాయని వైయస్సార్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్.డీ.ఓ వెంకారెడ్డి కి శుక్రవారం వైయస్సార్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదెర్ల శ్రీనివాస రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రోడ్లు బాగాలేక ప్రజలు అనునిత్యం ప్రమాదాలకు గురై విగత జీవులవుతున్నా కనీసం రోడ్లను బాగు చెయ్యాలనే ఆలోచన ప్రజాప్రతినిధులకు గాని,అధికారులకు గాని లేకుండా పోయిందని అన్నారు.
వెంటనే సంబంధిత అధికారులతో చర్చలు జరిపి హుజూర్ నగర్ నియోజకవర్గ రోడ్లను బాగు చేయించాలని అన్నారు.కెసిఆర్ బంగారు తెలంగాణ అని బొందల తెలంగాణగా మార్చారని,మఠంపల్లి మండలంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించారని,మోకాళ్ళ లోతు గుంతలతో ప్రయాణించడానికి అనువుగా లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న హుజూర్ నగర్ రోడ్లను పునరుద్ధరించి ప్రయాణికులను,ప్రజలను కాపాడాలని కోరారు.
హుజూర్ నగర్ ప్రధాన రహదారితో పాటు లింగగిరి రోడ్డు,మిర్యాలగూడ రోడ్డు,బైపాస్ రోడ్డు,హుజూర్ నగర్ మీదుగా అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు మొత్తం దుమ్ము ధూళితో అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయని,నిత్యం వేల సంఖ్యలో ఇక్కడి నుండి సిమెంటు ఫ్యాక్టరీలకు,వివిధ ప్రాంతాలకు వాహనములు వెళుతుంటాయని,ఈ క్రమంలో రహదారులు సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నందున తక్షణమే హుజూర్ నగర్ రహదారులను మరమ్మతులు చేయించాలని కోరారు.
మిషన్ భగీరథ పథకం పనుల వల్ల హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాల్లో రోడ్లను తవ్వి పైపులైను వేసి తవ్విన రోడ్లను సరిగా మరమ్మతులు చేయకుండా కాంట్రాక్టర్లు వారి ఇష్టానుసారం అలసత్వం వహించడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన కాంట్రాక్టర్ల లైసెన్సులు రద్దుపరచి వారిపై చర్యలు తీసుకొని రోడ్లను బాగు చేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నున్న రామారావు, కందుల నర్సింహా రెడ్డి,తోట కోటి నాయుడు,శాసనాల అంజి నాయుడు, లింగరాజు,హాసన్,అహ్మద్,బ్రహ్మచారి, రాము,నాని తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్