పేదలకు ఇంటి పట్టాలు, జగనన్న తోడు, ఉపాధిహామీ పనులు, నాడు-నేడు పనులు, కోవిడ్ -19, ఖరీఫ్ పంట కొనుగోలు – రబీ సీజన్ కు సమాయత్తం.. మొదలైన అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 25న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామని, అందుకు సంబంధించి చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ విసి హాలు నుండి జిల్లా ఎస్పీ అన్బు రాజన్, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం.గౌతమి (రెవిన్యూ), సాయికాంత్ వర్మ (అభివృద్ధి), డిఆర్వో ఎ.మాలోల లు హాజరయ్యారు.
అలాగే.. నవంబర్ 25వ తేదీన ప్రారంభించనున్న “జగనన్న తోడు” పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు.
“ఉపాధి హామీ” పనుల ద్వారా జరుగుతున్న సచివాలయ భవన నిర్మాణాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 2021 మార్చి 31వ తేదీ నాటికి ఎలాంటి పెండింగ్ లేకుండా.. ‘నాడు-నేడు’ పనులను పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బల్క్ మిల్క్ యూనిట్ల కోసం డిసెంబర్ 15 నాటికి.. గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.
కోవిడ్-19 ను అరికట్టే చర్యలను జిల్లాల్లో నిరంతరాయంగా నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ఇదే స్ఫూర్తితో అధికారులు కోవిడ్ కంట్రోల్ ఆపరేషన్ ను కొనసాగించాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించలేని విధంగా అత్యధికంగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అన్నిరకాల పాఠశాలలు, పలు విద్యాసంస్థల పునఃప్రారంభం నేపథ్యంలో.. జిల్లా కలెక్టర్లు మరింత దృష్టి సారించాలన్నారు.
ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ హాజరైన జిల్లా అధికారులతో మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన పెంచేలా గ్రామ సచివాలయాలు, కార్యాలయాల వద్ద విస్తృత ప్రచారం చేయాలన్నారు. సంక్షేమ పథకాల క్యాలండర్, సంక్షేమ పథకాల జాబితా, ఆరోగ్యశ్రీ సేవలందించే ఆసుపత్రుల జాబితా, ప్రభుత్వ సంబందిత టోల్ ఫ్రీ నెంబర్లు, సచివాలయాల్లో బోర్డులపై ప్రదర్శించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ తిప్పే స్వామి, డ్వామా పిడి యధుభూషన్ రెడ్డి, డిఎంహెచ్ఓ అనిల్ కుమార్, డిఇఓ శైలజ, ఎస్ఎస్ఏ పిఓ ప్రభాకర్ రెడ్డి, ఐసీడీఎస్ పిడి పద్మజ, వ్యవసాయశాఖ జెడి మురళీకృష్ణ, లీడ్ బ్యాంకు జిల్లా చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్ సంబందిత శాఖల జిల్లా అధికారులు, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.