కడప నగరపాలక సంస్థలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం కోసం పేదల ఇళ్లను కూల్చివేశారని, కూల్చివేతల మీద పెట్టిన శ్రద్ధ నగర అభివృద్ధి మీద ఎందుకు లేదని సిపిఎం కడప నగర కార్యదర్శి ఎ. రామమోహన్ ప్రశ్నించారు. శుక్రవారం నాడు కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కడప నగరపాలక సంస్థలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి పేదల ఇల్లు అడ్డుగా ఉన్నాయని ఇస్థానుసారంగా కూల్చివేసిన అధికారులు, వాటిని అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆయన విమర్శించారు. కడప నగరంలో ఆర్టీసీ బస్టాండ్, గురుకుల్ విద్యాపీట్ తదితర ప్రాంతాల్లో రోడ్డు మీద మోకాళ్ల లోతు నీరు నిలబడటం చూస్తే నిధుల దుర్వినియోగం చేస్తున్నట్లు అనుమానం వస్తోందన్నారు.
డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం కోసం కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నామని పాలకులు చేసిన ప్రకటన అనుమానాలకు తావిస్తోందన్నారు. కడప నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచేందుకు ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కడప నగరంలో ప్రవేట్ గ్యాస్ ఏజెన్సీలు తవ్వకాలు అడ్డగోలుగా ఉన్నాయని వాటిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ జరుగుతున్న తవ్వకాలపై నగర కార్పొరేషన్కు ఎంత పనులు చెల్లించారో ప్రజానీకానికి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం కడప నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి చంద్రారెడ్డి నగర కమిటీ సభ్యుడు మహబూబ్ తార పాల్గొన్నారు.