తిరుపతి ఫోటోగ్రాఫర్స్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన రాజా స్టూడియో అధినేత రాజాకు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. తిరుమల తిరుపతి తిరుచానూరు చంద్రగిరి రేణిగుంట లలో స్థానికులుగా ఉంటూ ఫోటో స్టూడియో లు నడుపుతున్న వారందరూ కలిసి ఈ సంఘంగా ఏర్పడ్డారు.
సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో సెల్ ఫోన్ లతో ఫోటోలు వీడియోలు తీసుకుంటున్న నేటి ఆధునిక యుగంలో ఫోటో స్టూడియోల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని ఈ సమయంలో ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఫోటో స్టూడియో వృత్తినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న వారికి అత్యాధునిక ఫోటోగ్రఫీ పరికరాల కొనుగోళ్లకు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు.
నగరపాలక సంస్థ పరిధిలోని ఫోటో స్టూడియోలకు పబ్లిసిటీ టాక్స్,వృత్తి పన్ను,ఆస్తి పన్నులలో రాయితీ కల్పించే విధంగా కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన పత్రికలలో పనిచేసే ఫోటోగ్రాఫర్లకు కేటాయిస్తున్న ఇంటి స్థలాల తరహాలో గుర్తింపు పొందిన ప్రైవేట్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు సైతం కేటాయించాలని ఆయన కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.