ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఈ నెల 18 తేదీన సచివాలయంలో శాఖాపరమైన విచారణ జరగనుంది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నేతృత్వంలో అభియోగాలపై విచారణ జరపనున్నారు.
సాక్షులుగా మాజీ డీజీలు రాముడు, సాంబశివరావు, మాల కొండయ్య, ఆర్పీ ఠాకూరులు ఉన్నారు. సాక్షులుగా విచారణకు హాజరు కావాలని మాజీ డీజీలకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ మెమోలు పంపింది.
ఏబీపై శాఖాపరమైన విచారణను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రోజువారీ విచారణను చేపట్టాలని విచారణాధికారికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
విచారణ నివేదికను మే 3 తేదీ నాటికి కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చేపట్టే విచారణను ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో చేపట్టాలని ఏబీ వెంకటేశ్వరరావు అభ్యర్ధించారు.
క్వాసీ జ్యూడీషియల్ సంస్థగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ గోప్యంగానే జరుగుతుందని తెలిపింది.