బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదివారం కోస్తాంధ్రలో చెదురుమదురుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అదే విధంగా తెలంగాణలో నేడూ రేపూ కూడా భారీనుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. అరేబియా సముద్రంలోనూ తుపాను ఆవర్తనం ఏర్పడటంతో మహారాష్ట్ర కర్నాటకలకూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ కారణంగా కృష్ణ గోదావరులకు మళ్లీ ప్రవాహాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తున్నది. తెలుగు రాష్ట్రాలలో నేడు సాయంకాలం వరకూ ఉరుములు పిడుగులూ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కోస్తా ఆంధ్ర తీరాన 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ అల్ప పీడనం ఆంధ్రతీరాన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయి ఉంది.
రేపటికల్లా మరింత బలపడగలదని అంచనా వేస్తున్నారు. దీన్ని అనుసరించి దక్షిణాది మీద రుతుపవనాలు బలపడినట్లుగా భావించాల్సి వస్తుంది.