సత్యం న్యూస్ తోమధిర నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి లింగాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధిర నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఖమ్మం జెడ్పీ చైర్మన్, మధిర నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలో తన గెలుపుకు దోహదపడే పలు అంశాలపై ఆయన సత్యం న్యూస్ తో మాట్లాడుతూ మధిర నియోజకవర్గం నుండి మూడుసార్లు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందినప్పటికీ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చేస్తున్న చొరవను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ జడ్పిటిసి సీటు ఇచ్చారని ప్రజల ఆశీస్సులతో గెలిచిన తనకు ఖమ్మం జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వడంతో నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్ధికి కృషి చేశానన్నారు.
2018 శాసనసభ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మెజార్టీ సీట్లను బిఆర్ఎస్ పార్టీ గెలుచుకుందన్నారు. నియోజకవర్గంలోని 131 గ్రామపంచాయతీలకు 70 గ్రామపంచాయతీలో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించామన్నారు. నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉంటే నాలుగు ఎంపీపీలు,నాలుగు జడ్పిటిసిలు గెలుచుకున్నామని తెలిపారు . 24 సహకార సంఘాలకు గాను 16 సహకార సంఘాలను గెలిచామన్నారు. నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీ అయిన మధిరలో కాంగ్రెస్, టిడిపి, సిపిఎం, సిపిఐ పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ 22 వార్డులకు గాను బిఆర్ఎస్ పార్టీ ఒంటరిగా 13 వార్డులను గెలుసుకుందన్నారు.
మధిర మున్సిపాలిటీలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఇండోర్ స్టేడియం, సమీకృత కూరగాయల మార్కెట్, మధిర చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన రూ 30 కోట్లతో మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళ పెన్షన్లు ఇప్పించడంతో పాటు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలను ఇప్పించడం జరిగిందన్నారు.అనారోగ్యానికి గురైన వందలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు ఇప్పించడం జరిగిందన్నారు .వేలాది మంది రైతులకు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించడంతోపాటు లక్షలోపు రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పారు . రైతు బీమా ద్వారా మరణించిన రైతుల కుటుంబాలకు రూ ఐదు లక్షల చొప్పున ఎటువంటి పైరవీరు లేకుండ ఇప్పించడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన అన్ని పరీక్షలలో ఉన్నతమైన అభ్యర్థి అని తేలిన తర్వాతనే తనను మధిర బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతిపక్షం ఎమ్మెల్యే ఉన్న దగ్గర ఎక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో ఇతర పార్టీల వారు విజయం సాధించలేరనే ప్రచారం తిప్పికొట్టామన్నారు. మధిర నియోజకవర్గంలో ఛాలెంజ్ గా తీసుకొని అన్ని ఎన్నికలలో మెజార్టీ స్థానాలలో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకున్నామన్నారు. స్థానిక సంస్థలలో సాధించిన విజయాలతో పాటు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్న తనను రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యేగా ప్రజల గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాళ్ళూరి మురళీకృష్ణ