అనాథ మృతదేహాన్ని ముట్టుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో మహిళా ఎస్సై శిరీష చేసిన సాహస కృత్యాన్ని ఏపి డిజిపి మెచ్చుకున్నారు.
శిరీషకు ఊహించని బహుమతిని డీజీపీ ఇచ్చారు. ఆమెకు డిస్క్ అవార్డును అందించి డ్యూటీతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉండాలని ప్రోత్సహించారు.
అవార్డుతో పాటు ప్రశంశా పత్రాన్ని గౌతమ్ సవాంగ్ అందజేశారు. పోలీసు శాఖలో ఉన్న మానవత్వాన్ని తన విధి నిర్వహణతో శిరీష చాటి చెప్పారని ఆయన ప్రశంసించారు.
పోలీసుల విధి నిర్వహణలో సేవాకార్యక్రమాలు కూడా ఓ భాగమన్నారు. పోలీసుల సేవానిరతిని ఎస్సై శిరీష ప్రత్యక్షంగా చూపించారన్నారు.
ఇదే సమయంలో తనకు అవార్డు రావడం పట్ల కాశీబుగ్గ ఎస్సై శిరీష స్పందించారు. ’నాకు అవార్డు’ రావడం సంతోషంగా ఉంది.
ఖాకీ డ్రస్ చాలా మంది వేసుకుంటారు కానీ ప్రజలకు సేవ చేసేది మాత్రం పోలీసులే అని ఆమె అన్నారు. నా తలిదండ్రులు నాకు నేర్పిన సేవాభావం ఈరోజు నాకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది.
డీజీపీ తోపాటు నాకు అభినందనలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నా. అంటూ శిరీష వ్యాఖ్యానించారు.