ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ కు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. రేషన్ బియ్యం పేరుతో రైస్ మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించడంపై కర్నూలు జిల్లా కల్లూరుకి చెందిన సౌదామిని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తన పిటిషన్ లో ఆరోపించారు. అక్రమాలు జరిగితే చట్టం, నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
తగిన ఉత్తర్వులు జారీ చేయాలని గతంలో అనేకసార్లు డీజీపీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే అధికారులు హైకోర్టు ఆదేశాలు పాటించడం లేదని కూడా ఆయన తెలిపారు. రైస్ మిల్లర్లు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారని ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపించారు. అయితే నిబంధనలు ఎందుకు పాటించడం లేదో వివరణ ఇవ్వాలని, వివరణ కోసం డీజీపీ హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.