రాజకీయంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ ఆగ్రహాన్ని తన పార్టీ ఎమ్మెల్యేలపై చూపించారు. మొత్తం 27 మంది ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదని ఆయన నేడు హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో సహ ఇన్ చార్జి పేరుతో కొందరిని నియమించే కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి జగన్, దానికి వచ్చిన ప్రతిఘటనతో నిలిచిపోయారు.
అయితే దాదాపు 60 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఆయన అనుకుంటున్నట్లు అప్పటిలో వార్తలు వచ్చాయి. అనంతరం గడప గడపకు కార్యక్రమంపై పి కే టీమ్ సర్వే నిర్వహించిందని, అందులో కొందరి పనితీరు బాగాలేదని నివేదికలు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్ తీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే ప్రశ్నేలేదని హెచ్చరిక జారీ చేశారు.
గడప గడపకు కార్యక్రమంలో 27 మంది చురుకుగా లేరంటూ మండిపడ్డారు. 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సీఎం తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 27 మంది 16 రోజులు మాత్రమే తిరిగారని, వారి పేర్లు వెల్లడించే పరిస్థితి తీసుకురావద్దని జగన్ సూచించారు.
సీఎం జగన్ హెచ్చరించిన వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గ్రంధి శ్రీనివాస్, శిల్పా చక్రపాణి రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, కోడుమూరు శ్రీనివాసులు, ధనలక్ష్మీ, మాజీ మంత్రి ఆళ్ల నాని తదితరులు ఉన్నారని చెబుతున్నారు. నవంబర్లో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు సమీక్షిస్తానని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికలకు 6 నెలల ముందే సీటు ఇవ్వనివారి పేర్లు ప్రకటిస్తానని కూడా ఆయన వెల్లడించారు.