ఖమ్మం నియోజవకర్గ పరిధిలో వివిధ చికిత్సలు అనంతరం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయా లబ్దికరులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెక్కులను పంపిణీ చేశారు. వివిధ వ్యాధి, బాధలతో అనారోగ్యం పాలై అత్యవసర చికిత్స అనంతరం వారికి సహాయార్థం సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన 65-మంది లబ్ధిదారులకు గాను రూ.25.65లక్షల విలువైన చెక్కుల ద్వారా ఆర్థిక సాయం మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. గడచిన ఎనిమిది ఏళ్లలో నేటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3808 చెక్కులకు గాను రూ.16.11 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం ఆయా కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నదన్నారు.
ముందస్తు, చికిత్సల అనంతరం చెక్కుల ప్రక్రియ క్యాంపు కార్యాలయంలో నిత్యం కొనసాగుతుందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఏ ఒక్క పేద కుటుంబం చికిత్సల అనంతరం ఆర్దికంగా చితికిపోకుండా వారికి సిఎంఆర్ఎఫ్ ద్వారా స్వాంతన కలిగిస్తోందన్నారు. పేదలకు ఇప్పటికే కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వ వైద్యం అందిస్తున్నామని గర్వంగా చెప్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు పసుమర్తి రాం మోహన్, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పైడిపల్లి సత్యనారాయణ, వీరు నాయక్, తదితర నాయకులు ఉన్నారు