యువతి ఫోటోలను, ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఓ ఆగంతకుడు వేధింపులకు గురి చేశాడు. తీవ్ర మనోవేదనకు గురైన బాధిత యువతి దిశ SOS కు కాల్ చేసి సహాయం కోరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం వుండే యువతికి గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడ్డాడు.
యువతికి అసభ్యకరమైన సందేశాలను, ఫోటో లను పంపించి ఇబ్బందులకు గురిచేశాడు. ఫేస్ బుక్ లో కాల్ గర్ల్ అని యువతి ఫోటోలను, ఫోన్ నెంబర్ ను అప్లోడ్ చేసాడు. ఆకతాయి వేధింపులు భరించలేక యువతి దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది.
బాధిత యువతి వద్దకు నిముషాల వ్యవధిలో దిశ పోలీసులు చేరుకున్నారు. అసభ్యకరంగా మెస్సేజ్ లు పోస్ట్ చేసిన ఆగంతకుడి వివరాలను, సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ ను దిశ టీం సేకరించింది. భయాందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలని బాధిత యువతికి పోలీసులు సూచించారు. సోషల్ మీడియా లో అప్లోడ్ అయిన యువతి ఫోటోలను, ఫోన్ నెంబర్ ను డిలేట్ చేసి యువతికి భరోసా ను కల్పించారు.
ఎలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినా వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆగంతకుడిని వీలయినంత త్వరగా పట్టుకుంటామని కర్నూలు మూడవ పట్టణ పోలీసులు పేర్కొన్నారు. దిశ SOS కు కాల్ చేసిన వెంటనే తమ సమస్యను పరిష్కరించిన పోలీసులకు బాధిత యువతి, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.