విజయగనగరం జిల్లాను హరిత విజయనగరంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు కొనియాడారు.
జల సంరక్షణలో జిల్లాకు జాతీయ అవార్డును సాధించడంతో పాటు, ఇటీవలే ఇండియన్ ఎచీవర్స్ ఫోరమ్ నుంచి మేన్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ఎంపికైన కలెక్టర్ హరి జవహర్లాల్ ను, జిల్లాకు చెందిన పలు స్వచ్ఛంద సంస్థలు స్థానిక రెవెన్యూ హోంలో ఘనంగా సత్కరించాయి.
ఛైల్డ్రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్, చేయూత ఫౌండేషన్, నా ఊరు-విజయనగరం, స్ఫూర్తి యూత్ అసోసియేషన్, అబ్దుల్ కలామ్ సేవా సంఘం, మాతృభూమి సేవాసంఘం మొదలగు స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు ఎస్.అచ్చిరెడ్ది, ఎం.రాము, వైవి సాయికుమార్, ఐ.గోపాలరావు, వి.శ్రీకాంత్ వర్మ, మండపాక రవి తదితరులు మాట్లాడుతూ జిల్లాకు కలెక్టర్ చేసిన సేవలను కొనియాడారు.
పచ్చదనాన్ని పెంచేందుకు ఎందరికో స్ఫూర్తి
కలెక్టర్ ను స్ఫూర్తిగా తీసుకొని, జిల్లాలో లక్షలాదిమంది ముందుకు వచ్చి పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. జిల్లాకు అత్యున్నత అధికారి అయినప్పటికీ, కలెక్టర్ తన విలువైన సమయాన్ని ప్రజోపయోగానికి వెచ్చిస్తూ, పచ్చదనాన్ని పెంచేందుకు, చెరువులను శుద్ది చేసేందుకు, రక్తదానం పట్ల అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు.
ఒక్కో స్వచ్ఛంద సంస్థ ఒక్కో చెరువును దత్తతగా తీసుకొని, వాటిని శుద్ది చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. కలెక్టర్ చేసిన కృషి జిల్లా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని అభినందించారు. డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఏ.నాగేశ్వర్రావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ను స్ఫూర్తిగా తీసుకొని, మొత్తం 134 చెరువులను అభివృద్ది చేస్తామన్నారు.
జిల్లా అటవీశాఖాధికారి ఎస్.జానకిరావు మాట్లాడుతూ కలెక్టర్ హరి జవహర్లాల్ హయాంలో మొదటి ఏడాది కోటి,75లక్షలు, రెండో ఏడాది కోటి, 33లక్షలు, ఈ ఏడాది ఇప్పటివరకు కోటి,15లక్షల మొక్కలను నాటమని చెప్పారు. కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజల మనసులో స్థానాన్ని సంపాదించడం, వారి అభిమానాన్ని చూరగొనడమే తనకు గొప్ప అవార్డు అని పేర్కొన్నారు.
జిల్లా యంత్రాంగం సమష్టి కృషి ఇది
తాను ఏనాడూ అవార్డులకోసం పనిచేయలేదని, చిత్తశుద్దితో, మనస్ఫూర్తిగా పనిచేడం వల్లే అవి లభిస్తున్నాయని అన్నారు. ప్రజాప్రతినిధుల తోడ్పాటు, ప్రజల సహకారం, జిల్లా యంత్రాంగం చేస్తున్న సమిష్టి కృషి కారణంగానే విజయనగరం జిల్లాకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను సాధించగలుగుతున్నామని చెప్పారు.
కలెక్టర్లంతా తమదైన ముద్రను జిల్లాపై వేయాలని, తమ ప్రత్యేకతను నిలుపుకోవాలని,సీఎం జగన్ తరచూ చెబుతుంటారని, ఆయన మాటలు తనకు ప్రేరణ కల్పించాయని చెప్పారు. రక్త దానాన్ని ప్రోత్సహించడం, జల వనరులను సంరక్షించడం, పచ్చదనాన్ని పెంపొందించడం, పరిశుభ్రత, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.
విజయవంతం అయిన రక్తదాన శిబిరం
తాను చేపట్టే ప్రతీ కార్యక్రమంలో కూడా ప్రజల భాగస్వామ్యం ఉందని, అందువల్ల ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిరంతరాయంగా కొనసాగుతాయన్న ఆశాభావాన్ని కలెక్టర్ వ్యక్తం చేశారు. కలెక్టర్కు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసిన సందర్భంగా, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, స్వచ్చంద సంస్థలు సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి.
ప్రముఖ జానపద గాయకుడు జానకిరామ్ పాడిన పాట అందరినీ అలరించింది. ఎక్సైజ్ అధికారి చిన్నంనాయుడు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డబ్ల్యూఐడిసి హెచ్ఆర్డి కన్సల్టెంట్ టి.సుధాకర్ రూపొందించిన సన్మానపత్రం ఆకట్టుకుంది. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ సంఘాలు, సంస్థల ప్రతినిధులు, అధికారులు, యువత పాల్గొన్నారు.