రైతు పండించిన పంటకు ధర నిర్ణయించుకునే అధికారం రైతుకు ఎలాగూ లేదని, కనీసం రైతుకు నచ్చిన పంటను వేసుకునే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. రైతు బంధు పథకాన్ని అస్త్రంగా మలుచుకుని రైతును బానిస చేయడానికి కుట్రలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
బుధవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చెప్పిన పంటలే వేయాలని రైతుల మెడపై కట్టిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సన్నరకం పంట వేస్తే ఒక్కో ఎకరానికి 18 వేల పెట్టుబడి పెరుగుతుందన్నారు.
ప్రభుత్వం ఇచ్చే 5 వేల రైతు బంధు కోసం మిగతా 13 వేల రూపాయలు రైతు నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. గత ఎన్నికల్లో రైతులకు సంబంధించి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎన్నికల్లో ఓట్లు వేయరని ముఖ్యమంత్రి ఆలోచించి ఉంటారని అన్నారు.
రైతులను అణగదొక్కలని చూసిన ఎంత పెద్ద పార్టీ అయినా భూస్థాపితం అయిందన్న విషయం ముఖ్యమంత్రి గుర్తుంచుకుంటే బాగుంటుందని సూచించారు. విత్తనాలు అమ్మే వారిని కలెక్టర్లు పిలిపించుకుని రైతులకు నచ్చిన విత్తనాలు అమ్మవద్దని, తాము సూచించిన విత్తనాలు మాత్రమే అమ్మలని వ్యాపారులను బెదిరించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.
ప్రాంతాలకు అనుగుణంగా పంటను వేయకుండా నేను చెప్పిన పంటను మాత్రమే వేయాలంటే రైతులు మీ పార్టీ కార్యకర్తలు కాదన్నారు. ఎన్నికల్లో నిజాయితీగా గెలవాలి తప్ప డబ్బులు ఇస్తూ పార్టీలను మార్పిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి బూచి చూపి పార్టీలోకి లాక్కోవడం ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని చెప్పారు