ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం మూకుమ్మడిగా బయటకు రాకుండా నిత్యావసర సరుకులు ప్రతి ఇంటికి హోమ్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నామని కడప జిల్లా రాజంపేట పురపాలక సంఘం కమిషనర్ యం.రాజశేఖర్ తెలిపారు. శనివారం నాడు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో 117 మంది వివిధ విదేశాలనుంచి వచ్చినట్లుగా గుర్తించి గృహ నిర్బంధం చేశామని తెలిపారు. వారికి రక్త నమునాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వ హించామని, ఎటువంటి అనుమానిత లక్షణాలు లేవని, వారిని స్వీయ నిర్బంధంలో ఉంచామని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కర్ఫ్యూ విధించిన నేపధ్యంలో దాన్ని ప్రతిష్టంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించి కరోనా మహమ్మారి ని పారద్రోలాలని పిలుపు నిచ్చారు.
నిత్యావరసర వస్తువుల కోసం డోర్ డెలివరి సౌకర్యం కల్పించామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా దుకాణాల యజమానుల ఫోన్ నెంబర్ల వివరాల పట్టిని విడుదల చేసారు. వారికి కావలసిన సరుకులను ఫోన్ ద్వారా తెలిపితే ఇంటికి తెచ్చి ఇస్తారని,ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.