రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పనితీరు చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అని పిస్తున్నదని పార్లమెంటు మాజీ సభ్యుడు, పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న వారిని, ప్రజాసమస్యలు ఎత్తి చూపుతున్న వారిని అణచి వేస్తున్న విధానం చూస్తుంటే తెలంగాణలో రాచరికపు వ్యవస్థ నడుస్తున్నట్లుగా అనుమానం వస్తున్నదని ఆయన అన్నారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో తన వ్యాఖ్యలు పోస్టు చేశారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల సందర్శనకు వెళుతున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటున్న తీరు పోలీసు రాజ్యానికి పరాకాష్ట అని ఆయన అన్నారు. రాజకీయ కార్యకలాపాలకు అడ్డుతగలడం నియంతృత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏమైనా నిషేధిత ఉగ్రవాద సంస్థ అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ప్రజాస్వామ్యవాదులు గళం విప్పాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు.