ఈ సంవత్సరం శబరిమల యాత్రకు భక్తులను అనుమతించేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధం అయింది. అయితే ఇందుకోసం కొన్ని కఠినతరమై నిబంధనలు ఏర్పాటు చేసింది. ఈ ఏడాది శబరిమల యాత్ర నవంబర్ 16 నుంచి మొదలు అవుతుంది. దర్శనాలను కరోనా నిబంధనలను అనుసరించి నిర్వహిస్తామని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి కదకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు.
స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించే కొవిడ్-19 సర్టిఫికెట్ ను తప్పనిసరిగా సమర్పించాల్సి వుంటుందని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబుల్లో మాత్రమే భక్తులు పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుందని అన్నారు.
దర్శనానికి వచ్చే భక్తులందరినీ స్క్రీనింగ్ చేస్తామని, సన్నిధానం, నీలక్కల్, పంబ ప్రాంతాల్లోని హాస్పిటల్స్ లో మరిన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తామని తెలిపారు.
పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతిక దూరాన్ని తప్పనిసరి చేస్తామని తెలిపారు. అత్యవసర సేవల కోసం ఓ హెలికాప్టర్ ను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న పథనంతిట్ట కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు.