వియత్నాం, థాయ్ లాండ్, అమెరికా దేశాలలో పండే డ్రాగన్ ఫ్రూట్ ను తెలంగాణ లో వివిధ రకాల వెరైటీలలో పండించడం ప్రారంభం అయింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ఆలియాబాద్ లో డాక్టర్ మాధవరం శ్రీనివాసరావు డ్రాగన్ ఫ్రూట్స్ ఫామ్ ను నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో బాటు విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడమే కాకుండా ఈ పండు ఆధారిత ఉత్పత్తుల తయారీ, మన వాతావరణానికి అనుకూలంగా మొక్కలను మలచడం స్ఫూర్థినిచ్చే అంశమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
బ్లడ్ షుగర్ తగ్గించడం, మలబద్దకం సమస్యను నివారించడం, ఎముకలను గట్టిపరచడం, గుండె సంబంధ వ్యాధులను రాకుండా చూడడం ఈ పండు చేస్తుందని ఆయన తెలిపారు. ఒకసారి నాటితే 20 ఏళ్ల దిగుబడి ఇచ్చే డ్రాగన్ పంటను సాగుచేయడమే కాకుండా ఇక్కడి రైతులకు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అందించేందుకు నర్సరీ ఏర్పాటుచేసి రైతులకు మెళకువలు నేర్పుతుండడం అభినందనీయమని మంత్రులు అన్నారు.