డ్రగ్స్ రాకెట్ ను పశ్చిమ గోదావరి జిల్లా లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వలపన్ని పట్టుకున్నారు. జిల్లాలో కొందరు యువకులు అత్యంత ఖరీదైన డ్రగ్స్ ను విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సమాచారంతో భీమవరం సెబ్ సి ఐ వర్మ, ఏలూరు టాస్క్ ఫోర్స్ సి ఐ ధనరాజులు ప్రత్యేక నిఘా పెట్టి యువకులను అరెస్ట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఎల్ ఎస్ డి, ఎం డి ఎం ఏ, ఇంకా కెమికల్ బేస్డ్ డ్రగ్స్ ను వీరు సరఫరా చేసేవారు. కేరళకు చెందిన డెల్విన్, షాహిల్, అనే ఇద్దరు వ్యక్తుల ద్వారా వీరికి డ్రగ్స్ అందుతున్నాయి. వారు ప్రస్తుతం ఉంటున్న బెంగళూరులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పోతవరం కు చెందిన రిత్విక్ బెంగళూరు నుండి ఈ డ్రగ్స్ జిల్లాకు తెచ్చి మరికొందరు యువకులతో కలిసి పెద్ద మొత్తంలో అమ్మకాలు జరిపినట్లు సమాచారం. ఏలూరు నగరంలోనే రిత్విక్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు నగరంలో కూడా వీరు డ్రగ్స్ భారీగా అమ్మకాలు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో గెట్ టుగెదర్ పార్టీ లలో కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు అరెస్టు చేసిన యువకులు వెల్లడించారు.