విజయనగరం జిల్లాలో కొన్ని మండలాల్లో ఆడ శిశువుల శాతం తగ్గడం ఆందోళన కలిగించే విషయమని, దీని పై ప్రత్యెక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడ పిల్లల నిష్పత్తి తగ్గడం ఆందోళన కలిగించే విషయమని, మెడికల్ ఐ.సీ.డీ.ఎస్. సిబ్బంది దీని పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ముఖ్య0గా బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని తెలిపారు.
బాల్య వివాహాలు వలన కలిగే నష్టాలను గ్రామస్థాయి వరకు అర్ధమయ్యేలా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఆడ పిల్లల శాతం తగ్గుతున్న మండలాల్లో కారణాలను విశ్లేషించుకొని, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. బడి మానివేసిన బాలికలను గుర్తించి కేజీబివి లలో చేర్పించాలని సూచించారు.
ఈ సమావేశం లో డి.ఎం.హెచ్.ఓ డా.రమణ కుమారి, ఐ.సీ.డీ.ఎస్ పీ.డీ రాజేశ్వరి, వన్ స్టాప్ సెంటర్, డీ.సీ.పీ.ఓ ప్రతినిధులు, సీడీపీఓ లు హాజరయ్యారు.