రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు హెచ్చరిక
ప్రజా రవాణాకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహకుల ఆగడాలను నిరోధించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు రవాణా శాఖ ప్రైవేట్ రవాణా పై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు నేతృత్వంలో దాడులు చేస్తున్నారు.
ప్రజలకు ప్రయాణం భారం కాకుండా సౌకర్యవంతమైన రవాణాను అందించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనల మేరకు 10 బృందాలు పక్కాగా దాడులు కొనసాగిస్తున్నట్లు ఎం ఆర్.ఎం.రావు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమన్నారు.
కమర్షియల్ లగేజీ తీసుకెళ్లడం, అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, అధిక చార్జీలు వసూలు చేయడం, రవాణా నిబంధనలను అతిక్రమించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
ఇప్పటికే రవాణా శాఖ స్ఫెషల్ డ్రైవ్ నిర్వహిస్తోందని, ఇప్పటి వరకు నిబంధనలను గాలికొదిలేసిన 104 ప్రైవేట్ ట్రావెల్స్ పై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ శివార్లో రవాణా శాఖ అధికారులు డేగ కన్నుతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని, రవాణా నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వారు ఎవరూ తప్పించుకోలేరని ఆయన ఘాటుగా స్పందించారు.
ఈ నెల 17 వరకు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు , ప్రధాన కూడళ్లతో పాటు, జాతీయ రహదారులపై విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు , ఇతర వాహనాలు నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరిగిన , పండుగ సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేసి ప్రజారవాణాకు ఆటంకం కలిగించాలని చూసినా సహించబోమన్నారు.
ప్రజలకు సౌకర్యవంతమైన ప్రజా రవాణాను అందించడం ప్రభుత్వం బాధ్యతగా గుర్తిస్తోందన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం కూడా నిబంధనలు ప్రకారం నడుచుకుని రవాణా శాఖకు సహకరించాలని కోరుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.