రాష్ట్రంలోని ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు ఇతర ఉన్నతాధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహారిస్తున్నారని ప్రతిపక్షాలు పలు సందర్బాల్లో ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే సీఈవోకి ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరగడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇన్ఛార్జ్ డీజీపీతోపాటు మొత్తం 8 మంది అధికారులను తక్షణం బదిలీ చేయాలని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహారిస్తున్న ఒక్కో అధికారి గురించి పూర్తి వివరాలు వెల్లడించారు. మార్చి 16న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈనెల 4న బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డిలు రాసిన లేఖలకు కొనసాగింపుగా తాము ఈ వినతిపత్రం సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, ఐజీపీ కొల్లి రఘురామ్రెడ్డితోపాటు మరో అయిదుగురు అధికారుల దుష్ప్రవర్తనపై ఎన్నికల సంఘం తక్షణం దృష్టిసారించాలని… వారంతా జూనియర్ అధికారులైనప్పటికీ సీనియర్లను పక్కకు తప్పించి కీలక స్థానాలను ఆక్రమించారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఒక్క అంశం వారి నిష్పాక్షికతలోని డొల్లతనాన్ని, అనుచిత వైఖరిని చాటుతోందని.. తమను అడ్డదారిలో అందలం ఎక్కించిన వారికి ప్రస్తుతం ప్రతిఫలం చెల్లించే పనిలో తలమునకలై ఉన్నారని తెలిపారు.
చీఫ్ సెక్రెటరీ, డీజీపీ, సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కుమ్మక్కై అక్రమాలు, ఆశ్రిత పక్షపతానికి ఎలా పాల్పడుతున్నదీ ఇదివరకే సమర్పించిన వినతిపత్రాల్లో వివరించామని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రోత్సహించడానికి ఈ అధికారులంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పూర్తిగా కుమ్మక్కయ్యారని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి వీరు కుట్రలు పన్నుతున్నారని మూడు పార్టీల కూటమి ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొంది. మొత్తం 8 మంది అధికారుల గురించి ఈసీకి ఫిర్యాదు చేయగా, వారిలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఈసీ మంగళవారం సాయంత్రమే బదిలీ వేటు వేసింది.