రానున్న కాలంలో దేశ రాజకీయ ఆర్ధిక వ్యవస్థలపై పెను ప్రభావం పడనున్నదా? ఖగోళంలో సంభవిస్తున్న పరిణామాలను చూస్తుంటే పెను ప్రభావం తప్పేలా లేదని భారత ఆమోద గణిత పంచాంగ కర్త, ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి పోన్నలూరి శ్రీనివాస గార్గేయ వెల్లడించారు.
ఖగోళంలో సుదీర్ఘ కాలం అనంతరం పక్షం రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న అరుదైన సూర్య, చంద్ర గ్రహణాలు ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు ఆయన అంచనా వేశారు. దీపావళి అమావాస్య నాడు తులా రాశిలో రాహు, స్వాతి నక్షత్రంలో రవి, చంద్ర, శుక్ర, కేతు గ్రహాలు చాతుర్ గ్రహ కూటమిగా వున్న సమయంలో గ్రహణాలు రావడం అరుదుగా సంభవిస్తుంది. ఇది కేతు గ్రస్త సూర్య గ్రహణం కావడం విశేషమని గార్గేయ అన్నారు. సహజంగా రాహు, కేతు ప్రభావంతో ఏర్పడే గ్రహణాల్లో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహు గ్రస్తమని, కేతు ప్రభావంతో ఏర్పడే దానిని కేతు గ్రస్త గ్రహణమని అంటారు..
అలాగే నవంబర్ 8వ తేదీ కార్తీక పౌర్ణమికి మేష రాశిలో భరణీ నక్షత్రంలో రాహుగ్రస్త చంద్ర గ్రహణం రానుందని గార్గేయ అన్నారు. ఇలాంటి అరుదైన గ్రహణాలు చాలా కాలానికి వస్తుంటాయని ఆయన తెలిపారు. ఇలాంటి సూర్య గ్రహణం 1929లో వచ్చిందన్నారు.
ఆ సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైనదని ఆయన అన్నారు. అమెరికా వాల్ స్ట్రీట్ కుప్ప కూలిందన్నారు. అలాగే పేరు మోసిన కంపెనీలు దివాలా తీసాయన్నారు. అదే విధంగా 27 ఏళ్ల క్రితం రాహగ్రస్త చంద్ర గ్రహణం వచ్చిన సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ లేమాన్ 2.76 లక్షల కోట్లకు దివాలా తీసిందని వివరించారు.
ఈ నేపధ్యంలో అనేక సంవ్సరాలపాటు అనంతరం పక్షం రోజుల్లో చోటుచేసుకున్న సూర్య చంద్ర గ్రహణాల ప్రభావం గతంలో మాదిరిగా ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతాయని గార్గేయ వెల్లడించారు. ప్రపంచ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందని ఆయన చెప్పారు. రష్యా – ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మరింత తీవ్ర త్రరం అవుతుందన్నారు.
అలాగే ఇరాన్ – ఇరాక్ , భారత్ – పాకిస్థాన్, చైనాల మధ్య యుద్ద సఖ్యత లోపించి, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని కూడా ఆయన అన్నారు. ప్రధానంగా పాకిస్తాన్ లో అంతర్గత పోరాటం జరుగుతుందన్నారు. అదేవిధంగా దేశాధినేతలకు రాజకీయంగా, ఆరోగ్యంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవాశముందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్నారు. మనీ లాండరింగ్ కేసులు ఎక్కువగా వుంటాయని, స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం వుంటుందన్నారు. భారత దేశంలో పశ్చిమ భాగం, అరేబియా, హిందూ మహా సముద్రాల ప్రాంతాలలో గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని గార్గేయ తెలిపారు.
ప్రధానంగా మధ్య ప్రదేశ్ పై అధిక ప్రభావం వుంటుందన్నారు. అలాగే గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, గోవా రాష్ట్రాలలో ఈ ప్రభావం చూపుతుందని చెప్పారు. ముఖ్యంగా అరణ్య ప్రాంతాలలో భూ కంపాలు రావడం, విమానాలు కూలడంతో పాటు సునామీలు వచ్చే ప్రమాదం వుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అలజడులు, ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని గార్గేయ వెల్లడించారు.